అయోధ్య రామాలయం నిర్మాణానికి యాచకుల విరాళం

Donation of beggars for construction of Ayodhya Ram Temple

న్యూఢిల్లీః ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్య రామాలయం ప్రారంభోత్సవ వేడుకలకు చకాచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ మందిరాన్ని చూసేందుకు యావత్ ప్రజానీకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. కాగా, ఎంతో ప్రతిష్టాత్మకంగా కడుతున్న భవ్య రామ మందిరం నిర్మాణం కోసం పలువురు భక్తులు తమ వంతు సాయం చేస్తూ.. రాముడిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు. వారికి తోచిన సాయం చేస్తున్నారు. డబ్బు, వస్తు రూపంలో కానుకలు అందజేస్తున్నారు. ఇందులో భాగంగానే కొందరు యాచకులు సైతం రామ మందిరం నిర్మాణంలో భాగమయ్యారు. ప్రయాగ్‌రాజ్‌ తోపాటు కాశీ ప్రావిన్స్‌ కు చెందిన కొందరు యాచకులు అయోధ్య రామాలయానికి భారీ విరాళం అందించారు.

ఆలయ నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ సంస్థ సమర్పణ్ నిధి క్యాంపెయిన్ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2020 నవంబర్‌లో కాశీకి చెందిన కొందరు యాచకులు ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించి ఈ క్యాంపెయిన్‌లో తమను భాగస్వాములను చేయాలని కోరారు. తొలుత అధికారులు సంశయించినా యాచకుల విజ్ఞప్తి మేరకు విరాళం స్వీకరించేందుకు అంగీకరించారు. దీంతో ప్రయాగ్‌రాజ్‌, కాశీ ప్రావిన్స్‌లోని 27 జిల్లాలకు చెందిన సుమారు 300 మందికిపైగా యాచకులు రామ మందిర నిర్మాణం కోసం రూ.4.50 లక్షల భారీ విరాళాన్ని అందించారు. యాచకులే కాకుండా.. 4 వేల మందికిపైగా రోడ్డు పక్కన చెప్పులు కుట్టి జీవనం సాగించే వాళ్లు, స్వీపర్లు తమ కష్టార్జితంలో కొంత సొమ్మును రామ మందిరం కోసం విరాళంగా అందించారు.