ఇద్దరు సీఎంలకు ఒప్పందం ఉంది..డీకే అరుణ

కృష్ణా జలాలను జగన్ కు కేసీఆర్ అమ్మేశారు

హైదరాబాద్ : రెండు రాష్ట్రాల సీఎం ల పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాలను జగన్ కు కేసీఆర్ అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. కృష్ణా జలాలను నీవు తీసుకుపో… గోదావరి జలాలను నేను తీసుకుపోతా.. అనేలా ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ పెద్ద ద్రోహం చేశారని… కృష్ణా నీటి పంపకాల్లో 299 టీఎంసీల నీటికి ఒప్పుకుని రావడమే ఆయన చేసిన తప్పని దుయ్యబట్టారు.

కృష్ణా జలాలపై కేసీఆర్ ది దొంగ నాటకమేనని అరుణ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో మరోసారి సెంటిమెంట్ ను రగిల్చేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. గట్టు మండలం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని… అక్కడ గట్టు లిఫ్ట్ కు ప్రతిపాదనలను సిద్ధం చేస్తే… వాటిని పక్కన పెట్టి డిజైన్లను మార్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల నుంచి గంప మట్టి కూడా తీయలేదని అన్నారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని దుయ్యబట్టారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/