కళాతపస్వి కె.విశ్వనాథ్ ఇకలేరు

టాలీవుడ్ చిత్రసీమ మరో గొప్ప డైరెక్టర్ ను కోల్పోయింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూశారు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2 తేదీన (గురువారం) రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో కె విశ్వనాథ్ జన్మించారు. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తర్వాత వాహిని స్టూడియోస్లో సౌండ్ ఆర్టిస్టుగా సినీ కెరీర్ను మొదలుపెట్టారు.
1965లో వచ్చిన ఆత్మగౌరవం సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన కె.విశ్వనాథ్ ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శ్రుతిలయలు, స్వయంకృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకులకు అందించారు. కేవలం దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా తన సత్తాచాటాడు. శుభసంకల్పం సినిమాతో తొలిసారి వెండితెరపై కనిపించిన కె.విశ్వనాథ్.. వజ్రం, కలిసుందాంరా, నరసింహనాయుడు, సీమసింహం, నువ్వులేకనీను లేను, సంతోషం, లాహిరి లాహిరి లాహిరిలో, ఠాగూర్ వంటి పలు సినిమాల్లో మంచి పాత్రలతో మెప్పించారు. కళాతపస్వి మరణంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మరణంతో ఆయన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు విషాదంలో మునిగిపోయారు. ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు.