రేపటి నుండి అందుబాటులోకి డిజిటల్ రూపాయి
రేపటి నుంచి మార్కెట్లోకి డిజిటల్ రూపాయి అందుబాటులోకి రాబోతుంది. డిసెంబర్ 1 నుంచి రిటైల్ డిజిటల్ రూపాయిని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించబోతున్నారు. ఈ మేరకు నిన్న భారతీయ రిజర్వు బ్యాంకు వెల్లడించింది. దీనినే ఈ-రూపాయిగా కూడా వ్యవహరిస్తారు. ఇందుకోసం ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్లోని భారతీయ స్టేట్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు తొలుత కస్టమర్లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (సీయూజీ) కు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.
చట్టపరమైన టెండర్ను సూచించే డిజిటల్ టోకెన్ మరో రూపమే ఈ-రూపాయి. క్రిప్టో కరెన్సీలా కాకుండా పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే అదే విలువను కలిగి ఉంటుంది. డిజిటల్ రూపాయి (ఈ-రుపీ ) వినియోగదారులు, వ్యాపారులకు బ్యాంకులు వంటి మధ్యవర్తుల ద్వారా పంపిణీ అవుతుంది. బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా ఈ-రూపాయితో లావాదేవీలు చేసుకోవచ్చు. లేదంటే మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాల్లోనూ నిల్వ చేసుకోవచ్చు. అలాగే, వ్యక్తుల నుంచి వ్యక్తుల మధ్య (పీ2పీ) వ్యక్తి-వ్యాపారి (పీ2ఎం) మధ్య డిజిటల్ రుపీతో లావాదేవీలు జరుపుకోవచ్చని రిజర్వు బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఆన్లైన్ లావాదేవీలు జరుగుతున్నట్టుగానే క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి కూడా చెల్లింపులు జరుపుకోవచ్చు. భౌతిక నగదు లానే ఇది కూడా భద్రత, సెటిల్మెంట్ను అందిస్తుంది. అయితే, డిజిటల్ రుపీ మన వాలెట్లలో ఉంటే దానికి వడ్డీ లభించదు. బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో ఉంటే మాత్రమే వడ్డీ లభిస్తుంది.