మేడారానికి పోటెత్తుతున్న భక్తులు

మేడారం మహాజాతర సందర్భాంగా భక్తులు అనేక రాష్ట్రాల నుండి తరలివస్తున్నారు. ఈరోజు ఆదివారం కావడంతో మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఈరోజు దాదాపు మూడు లక్షల మందికి పైగా భక్తులు సమ్మక్క-సారలమ్మ దర్శనానికి రానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారానికి వచ్చే మూడు మార్గాల్లోనూ ప్రత్యేక భద్రత కల్పించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు.

అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఖమ్మం – వరంగల్ రూట్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు ఖమ్మం సీసీఐ జాఫర్ తెలిపారు. ఈ నెల 23న ప్రత్యేక రైలు ఉ. 10 గంటలకు ఖమ్మం స్టేషన్ నుంచి బయలుదేరి మ.12.20కి వరంగల్ చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 1.55 గంటలకు వరంగల్ నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు ఖమ్మం చేరుకుంటుందని తెలిపారు..

ఈనెల 21 నుంచి జరిగే మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈనెల 18 నుంచి 26 వరకు వివిధ ప్రాంతాల నుంచి 6,000 బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. 55 ఎకరాల్లో తాత్కాలిక బస్టాండ్, సుమారు 4,800 సీసీ కెమెరాలు, 5,600 మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక మీడియా సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్, విద్యుత్ కోసం ప్రత్యేక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం మొత్తం గట్టి బందోబస్తు నడుమ ఉండనుందని అంటున్నారు.