ఢిల్లీలోని జహంగీర్ పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఘర్షణలు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని జ‌హంగిర్‌పురిలో అక్ర‌మ నిర్మాణాల‌ను కూల్చివేస్తున్నారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఓ వర్గం వారు రాళ్లు రువ్వడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. అయితే, జహంగీర్ పురిలో అల్లర్లకు కారణమైన వారి అక్రమ నిర్మాణాలను కూల్చేయాలంటూ బీజేపీ ఢిల్లీ చీఫ్ ఆదేశ్ గుప్తా.. ఎన్డీఎంసీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ కు లేఖ రాశారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలు చూసుకునే అల్లర్లకు పాల్పడిన వాళ్లు రెచ్చిపోయారని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్డీఎంసీ) మేయర్ ఆదేశాల మేరకు 400 మంది పోలీసు బలగాల బందోబస్తు నీడలో అధికారులు అక్కడకు చేరుకున్నారు. అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం ప్రారంభించారు. అల్లర్ల కోసం వాడిన గాజు సీసాలను దాచిన స్క్రాప్ గోదాములను మొత్తం కూల్చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రోడ్డు పక్కన ట్రాఫిక్ కు ఆటంకం కలిగించేలా ఉన్న కట్టడాలు, షాపులనూ కూల్చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

అయితే, ఎలాంటి నోటీసులు లేకుండా ఉన్నపళంగా కూల్చివేతలంటే రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడంతో.. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. కూల్చివేతలను ఆపివేయాలంటూ ఎన్డీఎంసీకి ఆదేశాలిచ్చింది. ఈ వ్యవహారంపై రేపు మరోసారి విచారిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు కూల్చివేతల వ్యవహారంపై విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. కాగా, జహంగీర్ పురి అల్లర్లకు సంబంధించి ఇప్పటిదాకా ఇద్దరు మైనర్లు సహా 25 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/