ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న చంద్ర‌బాబు

కాసేప‌ట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్ర‌బాబు

అమరావతి: ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ‌న్మ‌దినోత్స‌వం ఈ సంద‌ర్భంగా ఆయన ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్నారు. అమ్మ‌వారి ఆశీస్సులు తీసుకున్నారు. వేద ఆశీర్వచనం అందించారు వైదిక కమిటీ సభ్యులు. దర్శనానంతరం అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు ఆలయ ఈవో డి.భ్రమరాంబ. తన పుట్టినరోజు సంద‌ర్భంగా నేడు ప్రజలతో మమేకం కావాలని ఆయన నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు తెలుసుకోనున్నారు.

కాసేప‌ట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి నాయకులు, కార్యకర్త‌ల‌ను ఆయ‌న‌ కలవనున్నారు. ఈ రోజు సాయంత్రం ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నెక్కలగొల్లగూడెం గ్రామానికి వెళ్తారు. గ్రామంలోని కొందరి ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి స్థానికులతో మాట్లాడతారు. ఆ త‌ర్వాత‌ గ్రామసభ నిర్వహిస్తారు.

అలాగే, స్థానికులతో సహపంక్తి భోజనం చేస్తారు. వైస్సార్సీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎన్నికల వరకు జనం మధ్యే ఉండాలని చంద్ర‌బాబు నాయుడు భావిస్తున్నారు. దానికి నేడు నాంది పలుకుతున్నారు. మహానాడు అనంత‌రం 15 రోజులకో జిల్లాలో పర్యటించేలా ఇప్ప‌టికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్న విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు, చంద్ర‌బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా తిరుమ‌ల‌లోని అఖిలాండం వ‌ద్ద టీడీపీ నేత‌లు పూజ‌లు చేశారు. టీడీపీ ఏపీ రాష్ట్ర మీడియా స‌మ‌న్వ‌య‌క‌ర్త శ్రీ‌ధ‌ర్ వ‌ర్మ 720 కొబ్బ‌రికాయ‌లు కొట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/