భారత్ లోనే ఉంటా : ద‌లైలామా

టోక్యో: టిబెట్ ఆధ్యాత్మిక గురువు ద‌లైలామా బుధ‌వారం ఆన్‌లైన్ ద్వారా మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. తైవాన్‌కు వెళ్తారా అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న బ‌దులిస్తూ.. తాను ఇండియాలోనే ఉండేందుకు ఇష్ట‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు. తైవాన్‌, చైనా మ‌ధ్య సంబంధాలు బ‌ల‌హీనంగా ఉన్న నేప‌థ్యంలో అక్క‌డ‌కి వెళ్ల‌లేన‌న్నారు. చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అయ్యేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌లు లేవ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. చైనా నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేసిన దలైలామా.. వాళ్లు విభిన్న సంస్కృతుల్లో ఉన్న తేడా గ‌మ‌నించ‌లేర‌న్నారు. ఆ దేశానికి చెందిన ప్ర‌ధాన హ‌న్ తెగ ఆధిప‌త్యం ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. కానీ చైనా సోద‌ర సోద‌రీమ‌ణుల ప‌ట్ల త‌న‌కు ద్వేష‌భావం లేద‌న్నారు. క‌మ్యూనిజం, మార్కిజ‌మ్ భావాల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు.

మావో జిదాంగ్ నుంచి త‌న‌కు క‌మ్యూనిస్టు నేత‌లు తెలుసు అని, వారి ఆశ‌యాలు మంచివ‌ని, కానీ కొన్ని సంద‌ర్భాల్లో వాళ్లు విప‌రీతంగా ప్ర‌వ‌ర్తిస్తార‌ని, పూర్తి ఆధిప‌త్యం చెలాయిస్తార‌ని ద‌లైలామా అన్నారు. కొత్త త‌రం నేత‌ల పాల‌న‌లో చైనా మారుతుంద‌ని భావించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. చైనా క‌మ్యూనిస్టు నేత‌లు సంకుచిత భావంతో ఉంటార‌ని, విభిన్న సంస్కృతుల్లో ఉన్న వైవిధ్యాన్ని వాళ్లు అర్థం చేసుకోలేర‌న్నారు. చైనాలో హ‌న్ తెగ‌కు చెందిన వారి ఆధిప‌త్యం మ‌రీ ఎక్కువగా ఉంటుంద‌ని ద‌లైలామా అన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/