కేసీఆర్ ప్రెస్ మీట్లు చూసి జనం నవ్వుతున్నారు

సీఎం కేసీఆర్ కు ఈటల హెచ్చరిక

హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై రాజేందర్ మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఫలితం అంతం కాదని, ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. ఉద్యమకారులు సీఎం కేసీఆర్ ను వదిలి రావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ గంటలకొద్దీ ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్న మాటలు విని జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పెద్ద నోరుతో చెబితే అబద్ధాలు.. నిజాలైపోవని మండిపడ్డారు. కేసీఆర్ సీఎం అయ్యాక అసెంబ్లీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని విమర్శించారు. ధర్నా చౌక్ అవసరమేంటో కేసీఆర్ కు తెలిసొచ్చిందని, అది అవసరం లేదన్నవాళ్లే అక్కడ ఆందోళన చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.

ఎనిమిదేళ్లుగా వరి ధాన్యం కొంటున్నదెవరో సీఎం చెప్పాలని ప్రశ్నించారు. మిల్లింగ్ టెక్నాలజీని పెంచుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజలపై సీఎంకు నిజంగా ప్రేమ ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ నాయకత్వంలో సీఎం కేసీఆర్ నిరంకుశ, అవినీతి పాలనపై పోరాటం చేస్తానని ఈటల చెప్పారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎగిరేది బీజేపీ జెండానేనన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/