కరోనా ఆంక్షలపై సౌదీ కీలక నిర్ణయం !

రియాధ్: సౌదీ అరేబియా కరోనా ఆంక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7 నుంచి కొన్ని ఆంక్షలను సడలిస్తున్నట్లు విదేశాంగ శాఖ శనివారం ప్రకటించింది. ముఖ్యంగా వినోదాత్మక కార్యక్రమాలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా తొలగించింది. దీంతో సినిమా హాళ్లు, జీమ్స్, స్పోర్ట్స్ సెంటర్స్ ఆదివారం నుంచి తెరచుకోనున్నాయి. అయితే, పెళ్లిల ఫంక్షన్లు, కార్పొరేట్ మీటింగ్స్, బంక్వేట్ హాళ్లలో జరిగే ఈవెంట్స్, హోటల్ వెడ్డింగ్స్‌కు మాత్రం అనుమతి ఇవ్వలేదు.

అలాగే సామాజిక కార్యక్రమాలలో సమావేశమయ్యే వారి సంఖ్యను 20 మందికి పరిమితం చేసింది. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించే చర్యలకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. మహమ్మారి ముప్పు ఇంకా తొలిగిపోలేదు కనుక బహిరంగ ప్రదేశాల్లో ముఖాలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్ర చేసుకోవడం వంటి కొవిడ్ నిబంధనలు దేశ పౌరులు, నివాసితులు తప్పనిసరిగా పాటించాలని సౌదీ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/