బైడెన్ బృందంలో మరో ఇద్దరు భారతీయులకు చోటు

స్పెషల్ అసిస్టెంట్లుగా చిరాగ్ బెయిన్స్, ప్రణీత గుప్తా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన అధికార గణంలో మరో ఇద్దరు భారతీయులను నియమించారు. క్రిమినల్ జస్టిస్ శాఖలో ప్రెసిడెంట్ కు స్పెషల్ అసిస్టెంట్ గా చిరాగ్ బెయిన్స్ ను, కార్మిక ఉద్యోగుల శాఖకు స్పెషల్ అసిస్టెంట్ గా ప్రణీత గుప్తాను నియమించారు. ఈ మేరకు శుక్రవారం శ్వేత సౌధం ఉత్తర్వులను జారీ చేసింది. శ్వేత సౌధం కొవిడ్ స్పందన బృందం, దేశీయ పర్యావరణ విధాన శాఖ, దేశీయ విధాన మండలి, జాతీయ ఆర్థిక మండళ్లకు 20కిపైగా అధికారులను నియమిస్తామని బైడెన్ ఇదివరకే ప్రకటించారు. అందులో భాగంగానే బెయిన్స్, ప్రణీతను నియమించారు. ఈ నియామకాలతో బైడెన్ బృందంలోని భారతీయుల సంఖ్య 55కు చేరింది.

వారి నియామకాలపై శ్వేత సౌధం స్పందించింది. కొత్తగా నియమితులైన ఇద్దరూ ఎంతో అంకితభావం కలిగిన వ్యక్తులని, వారు ఈ పదవులకు అర్హులని శ్వేత సౌధం ప్రకటించింది. వారి నియామకం దేశ సామర్థ్యం, వైవిధ్యాన్ని చాటుతుందని పేర్కొంది. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు బైడెన్–హ్యారిస్ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది.

తాజా వీడియోస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/