శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం..

శ్రీసత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొత్తగా ప్రేమ పెళ్లి చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన రామగిరి మండలం లో గంగంపల్లి లో చోటుచేసుకుంది. గంగంపల్లికి చెందిన దాదా, జ్యోత్స్న ఒకరి నొకరు ఇష్టపడ్డారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. అయితే ఇరువురి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి నిరాకరించారు.

దీంతో 3 నెలల క్రితం ఇద్దరు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. చివరికి పెద్దలను ఒప్పించి గంగంపల్లిలో కాపురం కూడా పెట్టారు. అయితే సడెన్ గా ఏం అయినదో తెలీదు గాని వివాహం జరిగిన మూడు నెలలకే ఈ దంపతులు తోటలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చావు లోనూ ఒకరికి ఒకరు తోడు అన్నట్లు కలిసే ప్రాణాలను తీసుకున్నారు. కాగా ముచ్చటగా కాపురం చేసుకుంటున్నారు అనుకున్న ఈ జంట అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.