హైదరాబాద్లో కరోనా ప్రభావం ఎక్కువ ఉంది..ఈటల
మళ్లీ రేపటి నుంచి కొవిడ్ టెస్ట్లు చేస్తాం..

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈరోజు మీడియాతో మాట్లాడారు.. హైదరాబాదులో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని… పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని ఆయన తెలిపారు. నగరంలో మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కరోనా ప్రభావం తక్కువగా ఉందని తెలిపారు. రేపటి నుంచి మళ్లీ కోవిడ్ టెస్టులను నిర్వహిస్తామని చెప్పారు.
కరోనా పేషెంట్లకు సరైన చికిత్స అందించడం లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అందులో వాస్తవం లేదని ఈటల అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం చికిత్స అందిస్తున్నామని తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న 258 మంది వైద్య సిబ్బందికి కూడా పాజిటివ్ వచ్చిందని… హెడ్ నర్స్ ఒకరు ప్రాణాలను కోల్పోయారని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్లు, బెడ్ల కొరత లేదని… మరో వారం రోజుల్లో అదనంగా 10 వేల బెడ్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. అవసరమైతే హైదరాబాద్లో లాక్డౌన్పై ఆలోచనా చేయాల్సి ఉంటుందని సిఎం కెసి ఆర్ చేప్పారన్నారు. నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ సమావేశం ఉంటుందని తెలిపారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/