స్టేషన్ ఘనపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాలిః కడియం శ్రీహరి

స్టేషన్ ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిపోయిందన కడియం శ్రీహరి

corruption-has-increased-in-station-ghanpur-alleges-kadiyam-srihari

వరంగల్ ః బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో అవినీతి పెరిగిందని ఆరోపించారు. దాన్ని అంతమొందిస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం రాత్రి మీడియాతో తన నివాసంలో మాట్లాడిన ఆయన.. ‘మీరిచ్చిన (ప్రజలు) ఖడ్గంతో ఆ అవినీతిని అంతమొందిస్తాను. నిఖార్సైన, నిజాయితీ, మచ్చలేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నా’ అని వ్యాఖ్యా నించడం చర్చనీయాంశమైంది. స్టేషన్ ఘన్ పూర్ నియోజవర్గంలోని ప్రతి తండాను అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని హామీ ఇచ్చారు.

ప్రజలు ఆశీర్వాదం తనపై ఉండాలని, స్టేషన్ ఘనపూర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఆశీర్వదించి అవకాశం ఇచ్చినప్పుడు అభివృద్ధికి కృషి చేయాలి తప్పి డబ్బులు దండుకోకూడదని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్యను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని, నియోజవర్గం, పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాజయ్య, కడియంకు మధ్య కొన్నాళ్లుగా పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంతో కడియం తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.