జైపాల్రెడ్డికి కాంగ్రెస్ నేతల నివాళులు
తెలంగాణ సాధనలో జైపాల్ రెడ్డి చొరవ మరువలేనిది ఆయన కృషి వల్లే హైదరాబాద్కు మెట్రో వచ్చింది

హైదరాబాద్: దివంగత నేత, మాజీ కేంద్రమంత్రి జైపాల్రెడ్డి జయంతి సందర్భంగా నెక్లెస్రోడ్డులోని జైపాల్ ఘాట్ వద్ద గురువారం ఉదయం కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. మండలి చైర్మన్ గుత్తా, ఉత్తమ్, చిన్నారెడ్డి, కోమటిరెడ్డి, వీహెచ్, రేవంత్రెడ్డి, డీఎస్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, పల్లంరాజు, నాగం తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి చొరవ మరువలేనిదని మండలి చైర్మన్ గుత్తా అన్నారు. జైపాల్రెడ్డి వల్లే తెలంగాణకు హైదరాబాద్ దక్కిందని, జైపాల్రెడ్డి కృషి వల్లే హైదరాబాద్ మెట్రో వచ్చిందని ఆయన గుర్తు చేశారు. నేటి యువత జైపాల్రెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మరోనేత చిన్నారెడ్డి పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో అవినీతి మరక లేని ఏకైక నాయకుడు జైపాల్ రెడ్డి అని కొనియాడారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్ పేరు పెట్టాలని సీఎంను కోరుతున్నానన్నారు. పార్లమెంట్లో జైపాల్రెడ్డి ప్రసంగాలు తెలంగాణ ఖ్యాతిని పెంచాయని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు.
తాజా ఏపీ వర్తాల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/