అసెంబ్లీలో ఇరిగేషన్ ఫై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం!

నేడు అసెంబ్లీలో ఐదో రోజు సమావేశాలు జరగనున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఫై చర్చ జరగనుంది. చర్చలో భాగంగా సభ్యుల ప్రశ్నలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇరిగేషన్ ఫై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మేడిగడ్డపై విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్ ను సభలో ప్రవేశపెట్టనుంది.

గత ప్రభుత్వం ప్రాజెక్టుల్లో వైఫల్యాలు, గణాంకాలు, వివరాలు, ఆధారాలతో సహా ఇప్పటికే ప్రజల ముందుంచిన రేవంత్ ప్రభుత్వం.. మరో కీలకమైన దిశగా అడుగు వేసింది. సాగునీటి రంగంలో బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవకతవకలు, అవినీతిపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రాన్ని అసెంబ్లీ వేదికగా విడుదల చేసేందుకు రెడీ అయింది. మేడిగడ్డ డ్యామేజీని వివరించడానికి నిన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక టూర్ నిర్వహించిన ప్రభుత్వం..ఈరోజు బడ్జెట్ సెషన్‌లో ఇరిగేషన్ వైట్ పేపర్ పేరుతో మరికొన్ని వివరాలను బుక్‌లెట్ రూపంలో టేబుల్ చేసేలా షెడ్యూల్ ఖరారు చేసింది.

ఇప్పటికే ఆర్థిక, విద్యుత్ రంగాలపై ప్రభుత్వం శ్వేత పత్రాలను విడుదల చేసింది. లేటెస్ట్‌గా ఇరిగేషన్‌ విషయంలోనూ వైట్‌ పేపర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. మంత్రి ఉత్తమ్ కుమార్ అన్ని అంశాలను వివరించడంతో పాటు సభ్యుల అభిప్రాయాలను తెలుసుకునేలా చర్చకు అవకాశం ఇవ్వనున్నారు.