మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి ప‌థ‌కాల‌ను ప్రారంభించిన సీఎం

CM started Mahalakshmi and Gruha Jyothi scheme

హైద‌రాబాద్ : తాము ఇచ్చిన హామీలను నమ్మి తెలంగాణ ప్రజలు తమకు ఓటు వేసి అధికారం ఇచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారెంటీలలో భాగంగా మరో రెండు… మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలను ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు. పేదవారి ఇళ్లలో వెలుగులు నింపాలని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇచ్చిన గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

తాము అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లో రెండు హామీలను నెరవేర్చామని… ఇప్పుడు మరో రెండు హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే వెనుకడుగు వేయదన్నారు. తాము ఆర్థిక నియంత్రణ పాటిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన హామీని ఎప్పుడూ విస్మరించలేదన్నారు. అర్హులైన వారందరికీ ఉచిత కరెంట్ ఇస్తామన్నారు.

అర్హత ఉండి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోకుంటే మళ్లీ అవకాశం ఉంటుందన్నారు. మండల కార్యాలయానికి వెళ్లి ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తును అందించవచ్చునని చెప్పారు. యూపీఏ హయాంలో దీపం పథకం అమలు చేశామని అప్పుడు రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇచ్చామని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రూ.1200కు పెంచిందని ఆరోపించారు.

కాగా, చేవెళ్లలో ఈ కార్యక్రమాన్ని లక్ష మంది కార్యకర్తలతో ప్రియాంక గాంధీ సభకు హాజరై ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ నిన్న మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడం.. పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మండలాలు, వివిధ జిల్లాల్లో ఉండటం వల్ల ఎన్నికల నిబంధనలు అడ్డు రావడంతో ఇవాళ సచివాలయంలో ప్రారంభించుకున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.