డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్

తెలంగాణ డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో డ్రగ్స్ చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమీక్షా సమావేశం జరిపారు.

ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి కృష్ణరావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవీ గుప్తా, ఇంటలిజెన్స్ విభాగం అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు వినియోగించినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణా రాష్ట్ర యాంటీ నార్కొటిక్ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్ ను నియమించడంతోపాటు ఆ విభాగం బలోపేతం చేయాలన్నారు.