టికెట్ రేట్లను అప్‌డేట్ చేసిన దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో

ముందు వరుస సీట్ల బుకింగ్‌పై రూ.2000, నడకదారి సీట్ల బుకింగ్‌పై రూ.1500 ఛార్జీ విధింపు

2000-charge-if-you-book-front-seat-in-indigo-flights

న్యూఢిల్లీః బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో ఫ్లైట్ టికెట్ రేట్లను అప్‌డేట్ చేసింది. ప్రయాణికులకు సౌకర్యవంతంగా కాస్త ఎక్కువ ‘లెగ్ రూమ్’ ఉండే ముందు వరుస సీట్ల బుకింగ్‌పై రూ.2000 ఫిక్స్‌డ్ ఛార్జీ నిర్ణయించింది. ఇక విండో సీటు బుకింగ్‌పై రూ.2000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని ఇండిగో వెబ్‌సైట్ పేర్కొంది. 222 సీట్లు ఉండే ఏ321 విమానం ముందు వరుసలో విండో సీటు బుకింగ్‌పై రూ.2000, నడక దారి సీటు బుకింగ్‌పై రూ.1500, అదే వరుసలోని రెండవ, మూడవ సీట్ల బుకింగ్‌పై రూ.400 ఛార్జీలు ఉంటాయని తెలిపింది. 232 సీట్లు ఉన్న ఏ321 ఫ్లైట్, 180 సీట్లు ఉన్న ఏ320 ఫ్లైట్‌కు కూడా ఇవే ఛార్జీలు వర్తిస్తాయని తెలిపింది.

ప్రయాణికులు ఒకవేళ ప్రాధాన్య సీటు అవసరం లేదనుకుంటే అదనపు ఛార్జీలు లేని సీటును ఎంపిక చేసుకోవచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో చెక్-ఇన్ సమయంలో సీటును కేటాయిస్తారని ఇండిగో వెబ్‌సైట్ పేర్కొంది. కాగా ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఉంది. దేశీయ విమానయానరంగంలో 60 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది.