వరద బాధితులకు నిత్యావసరాలు సీఎం స్టాలిన్ పంపిణీ
చెన్నైః మిగ్జాం తుఫాన్ తాకిడికి తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపైకి వరదనీరు రావటంతో కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. తుఫాన్ ప్రభావంతో గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు బుధవారానికి తగ్గినప్పటికీ, నగరం ఇంకా వరద ముంపులోనే ఉంది. చాలా ప్రాంతాల్లో వరద నీరు ఇంకా తొలగిపోలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా కరెంటు, ఆహారం, నీరు లేక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యటించారు. వరద సాయం కింద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.