తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్

వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గడ్డం ప్రసాద్

telangana-assembly-new-speaker-is-gaddam-prasad-kumar

హైదరాబాద్ ః తెలంగాణ శాసనసభ నూతన స్పీకర్‌గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ వ్యవహరించనున్నారు. ఆయన పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. 2012లో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో ప్రసాద్‌కుమార్ టెక్స్‌టైల్ మంత్రిగా పనిచేశారు. రేవంత్‌రెడ్డికి ప్రధాన అనుచరుడైన ఆయనకు ఇప్పుడు స్పీకర్ పదవి లభించింది. ఎస్సీ కోటాలో గెలుపొందిన దామోదర రాజనర్సింహకు మంత్రి పదవి దక్కడంతో ప్రసాద్‌కు అధిష్ఠానం స్పీకర్ పదవి అప్పగించింది. దీంతో దళిత సామాజిక వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, రేవంత్‌రెడ్డి మరికాసేపట్లో తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఇప్పటికే సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీ సహా అధిష్ఠానం పెద్దలు హైదరాబాద్ చేరుకున్నారు.