తెలంగాణలో ఎప్పటికీ విద్యుత్ సమస్య రాదుః సిఎం కెసిఆర్‌

CM KCR Public Meeting at balkonda

బాల్కొండ: నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండలో బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాదసభ నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందన్నారు. మోడీ ఇప్పటికే రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు ప్రైవేటుపరం చేశారని మండిపడ్డారు. సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోడీ ఒత్తిడి చేస్తున్నారని కెసిఆర్ పేర్కొన్నారు. చచ్చినా.. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని కేంద్రానికి చెప్పానని వివరించారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం మనకు ఇవ్వాల్సిన రూ. లక్ష కోట్లు ఇవ్వలేదని ఆరోపించారు.

నష్టం వచ్చినా.. వరి, జోన్న వంటి పంటలు కొంటున్నాం. ధాన్యం అమ్మిన వారంలోనే రైతులకు డబ్బులు ఖాతాల్లో వేస్తున్నామని కెసిఆర్ వెల్లడించారు. ధరణి పోర్టల్ వల్ల రైతులకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ధరణి వచ్చాక రైతుల భూములపై ఉన్న బాసులు లేకుండా పోయారు, ధరణి వల్ల భూములు రిజిస్ట్రేషన్లలో దళారులు లేకుండా పోయారని ఆయన వెల్లడించారు. ఎవరూ అడగకుండానే రైతుబంధు తీసుకువచ్చానని కెసిఆర్ తెలిపారు. తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నుల వరి పండుతోందన్నారు. మిగితా ప్రాజెక్టులు పూర్తయితే 4 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తామన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తయితే.. తెలంగాణలో ఎప్పటికీ విద్యుత్ సమస్య రాదని ఆయన వెల్లడించారు. 17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు.. ఎక్కడైనా పింఛను ఇస్తున్నారా? అని కెసిఆర్ ప్రశ్నించారు.