ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందాం – ఇఫ్తార్ విందులో కేసీఆర్ కామెంట్స్

ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని..రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా, ముస్లిం మతపెద్దలతో పాటు 13 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. ముస్లిం చిన్నారులకు కేసీఆర్ రంజాన్ కానుకలు అందించారు.
ఈ సందర్బంగా కేసీఆర్ మాట్లాడుతూ..ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలి..ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుంది. గంగాజమునా తెహజీబ్ సంస్కృతి విశిష్టమైంది అని అన్నారు.




తొమ్మిది ఏళ్ల కిందట తెలంగాణ అంటే వెనుకబడింది అనేవారు. ఇప్పుడు అభివృద్ధిలో మన దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా లేదు. తలసరి ఆదాయం తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పదేండ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మైనార్టీల కోసం గత తొమ్మిది ఏళ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం అని తెలిపారు.