సివిల్స్ టాపర్స్‌కు సీఎం కేసీఆర్ అభినందనలు

సివిల్స్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థుల‌కు సీఎం కేసీఆర్ అభినంద‌న‌లు తెలిపారు. వారు మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌ని ఆకాంక్షించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తమ సత్తా చాటారు. తెలంగాణలోని నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కూతురు ఉమా హారతి మూడో ర్యాంక్ సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించి, సివిల్స్‌కు ఎంపికైన విద్యార్థులకు తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో వారంతా మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

సివిల్స్‌లో మూడో ర్యాంక్ సాధించిన ఉమా హారతిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అభినందించారు. ఉమా హారతి తండ్రి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లుతో తనకు గల అనుబంధాన్ని సీవీ ఆనంద్ గుర్తు చేసుకున్నారు. తాను 1996-99 మధ్య నిజామాబాద్ జిల్లా ఎస్పీగా పని చేసినప్పుడు కామారెడ్డి ఎస్సైగా వెంకటేశ్వర్లు పని చేసేవారన్నారు. ఇప్పుడు నారాయణపేట ఎస్పీగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు.. నక్సల్స్ సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ఉమా హారతి విజయం సాధించినందుకు ఆమె కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పరీక్షలో యూపీకి చెందిన ఇషితా కిశోర్ అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో బిహార్‌కు చెందిన గరిమా లోహియా రెండో స్థానంలో నిలిచింది. ఇక తెలంగాణకు చెందిన ఎన్ ఉమా హారతి మూడో స్థానం కైవసం చేసుకుంది. యూపీకి చెందిన స్మృతి మిశ్రా నాలుగో స్థానంలో నిలవగా.. అసోంకి చెందిన మయూర్ హజారికా ఐదో స్థానం, కొట్టాయంకు చెందిన గెహనా నవ్య జేమ్స్ ఆరోస్థానం దక్కించుకున్నారు.