అమెరికా అధ్యక్షుడి హత్య కేసులో తెలుగు యువకుడు అరెస్ట్

అమెరికా అధ్యక్షుడి హత్యకు తెలుగు సంతతి కుర్రాడు ప్లాన్ చేశాడని పోలీసులు అరెస్టు చేశారు. అమెరికా అధ్యక్షుడు, లేదా ఆయన కుటుంబ సభ్యులను ఎవరినో ఒకర్ని చంపేందుకు ప్లాన్ చేసాడనే కోణంలో కందుల సాయి వర్షిత్‌ (19) తెలుగు సంతతికి చెందిన యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూహాల్ అనే పేరుతో ఉన్న ట్రక్‌లో సాయి వర్షిత్‌ వైట్ హౌస్ వద్ద కలకలం రేపాడు. అక్కడ ఉన్న బారికేడ్స్‌ను ట్రక్‌తో ఢీ కొట్టి వైట్‌హౌస్‌లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు.

అతన్ని విచారిస్తే అమెరికా అధ్యక్షుడిని , వైస్‌ ప్రెసిడెంట్‌ను కానీ, వారి కుటుంబ సభ్యులను కానీ చంపేందుకు కుట్ర పన్నినట్టు తెలిసిందని పోలీసులు అభియోగాలు మోపారు. సాయి వర్షిత్‌ను అరెస్టు చేసిన సమయంలో ట్రక్‌లో నాజీ జెండాను గుర్తించినట్టు పోలీసులు వివరించారు. అమెరికా అధ్యక్షుడిపై దాడికి ఆరు నెలలుగా ప్లాన్ చేసినట్టు ఒప్పుకున్నాడని చెబుతున్నారు. సోమవారం రాత్రి 9:40 సమయంలో మిస్సౌరీలోని చెస్టర్‌ఫీల్డ్‌కు చెందిన సాయివర్షిత్‌ లాఫాయెట్ పార్క్‌కు సమీపంలో ఉన్న హెచ్ స్ట్రీట్ 1600 బ్లాక్‌లోని బోలార్డ్‌లపై ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశాడని పోలీసులు చెబుతున్నారు.