నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

సీఎం జగన్ ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకుంటారు. అక్కడ నూతనంగా నిర్మించిన ఇరిగేషన్‌ రిటైనింగ్‌ వాల్, రివర్‌ ఫ్రంట్‌ పార్కుకు ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలోని పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధి దారులకు అందజేస్తారు. రిటైనింగ్ వాల్స్ పూర్తి కావడంతో కృష్ణలంక వాసుల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

సీఎం జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు విధించారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. సీఎం జగన్ పర్యటన కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. ప్రజలు గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.