వచ్చే 48 గంటలోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్‌

cm- jagan-video-conference-flood-situation-in-ap

న్యూఢిల్లీః సిఎం జగన్‌ ఈరోజు ఉదయం రాష్ట్రంలో వరదలపైఅధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌‌లో సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాల్సి ఉందని అధికారులకు గుర్తు చేశారు. సీనియర్‌ అధికారులు, కలెక్టర్ల భుజాలమీద ఈ బాధ్యత ఉందన్నారు. వచ్చే 48 గంటల్లో ఏ ఇల్లుకూడా మిగిలిపోకుండా రూ.2వేల రూపాయల సహాయం అందాలన్నారు. అలాగే 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్.. వరద బాధిత కుటుంబాలకు వచ్చే 48 గంటల్లో అందాలన్నారు. ముంపునకు గురైన ప్రతీ గ్రామంలో పంపిణీని ముమ్మరం చేయాలన్నారు. కలెక్టర్లు, సీనియర్‌ అధికారులు దీన్ని సవాల్‌గా తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రం, అధికారుల ప్రతిష్టను కొందరు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. కొందరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చడానికే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బురద జల్లడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. విరామం లేకుండా పని చేస్తున్న సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలకు మంచి చేస్తున్న సిబ్బంది వెనకడుగు వేయాల్సిన అవసరం లేదన్నారు ముఖ్యమంత్రి. దురుద్దేశ పూర్వకంగా కొందరు చేసే ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సహాయక చర్యల కోసం నిధుల సమస్య లేనే లేదని, ప్రో యాక్టివ్‌గా ముందుకెళ్లాలని సిఎం జగన్‌ స్పష్టం చేశారు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/