ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ఫై తెరాస యాక్షన్ ప్లాన్ ..

వరి కొనుగోలు విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై తెరాస సర్కార్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. కేంద్రం మెడ‌లు వంచేందుకు ఐదంచెల కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో శ‌నివారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పండిన వరిధాన్యాన్ని కేంద్రం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేసారు. పంజాబ్ రాష్ట్రానికి ఓ నీతి, తెలంగాణకు ఓ నీతా అంటూ ప్రశ్నించారు. కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా యాక్ష‌న్‌ప్లాన్ ప్ర‌క‌టించారు.

ఈ నెల 4న మండ‌ల‌ కేంద్రాల్లో నిర‌స‌న దీక్ష‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలాగే, ఏప్రిల్ 6న తెలంగాణ‌లోని నాలుగు ప్ర‌ధాన జాతీయ ర‌హ‌దారుల‌పై నిర‌స‌న చేపడతామన్నారు. ఏప్రిల్ 7న 32 జిల్లా కేంద్రాల్లో మంత్రులు, శాస‌న స‌భ్యులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న దీక్ష‌లు చేప‌డుతామ‌న్నారు. ఏప్రిల్ 8న రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయ‌తీల్లో ప్ర‌తి రైతు త‌న ఇంటిమీద న‌ల్ల‌జెండా ఎగుర‌వేయాల‌ని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే, ప్ర‌తి గ్రామంలో కేంద్ర స‌ర్కారు దిష్టిబొమ్మ ద‌హ‌నం చేయాల‌ని టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు పిలుపునిచ్చారు. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 11న చ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తామ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులంతా ఢిల్లీలో నిర‌స‌న చేప‌డుతామ‌ని తెలిపారు.

అలాగే బండి సంజయ్ మానసిక స్థితిపై కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా భారత ప్రభుత్వం ప్రతి గింజ కొంటుందని చెప్పారు.. అయితే ఢిల్లీ బీజేపీ కరెక్టా.. సిల్లీ బీజేపీ కరెక్టా అని ప్రశ్నించారు. లోకల్ బిజెపి నాయకులకు తల తోక లేదని విమర్శించారు. కిషన్ రెడ్డి ఒక పనికి మాలిన మంత్రి …బండి సంజయ్ ఒక దౌర్భాగ్యడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.