నేడు గుంటూరు జిల్లా పర్యటనకు సీఎం జగన్

అమరావతి : సీఎం జగన్ నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో ఇస్కాన్ సంస్థ ఏర్పాటు చేసిన కేంద్రీకృత వంటశాలను సీఎం ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ఆహారాన్ని ఇక్కడ తయారు చేయనున్నారు. ఇక్కడి నుంచే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. దీని కోసం ఇస్కాన్ అక్షయపాత్ర ఫౌండేషన్ అత్యాధునిక వంటశాల సిద్ధం చేసింది. వంటశాల ప్రారంభించిన అనంతరం జగన్‌ తాడేపల్లి మండలం కొలనుకొండ వెళ్లనున్నారు. అక్కడ ఇస్కాన్ 70కోట్లతో ఏర్పాటు చేస్తున్న గోకుల క్షేత్రానికి సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు.

ఇస్కాన్ తరపున ఏపీలో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు. ఇక్కడ రాధాకృష్ణులు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించనున్నారు. అలాగే యోగ ధ్యాన కేంద్రాలు, సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించేందుకు కళా క్షేత్రాలు, యువత కోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు కానున్నాయి. గోకుల క్షేత్రానికి భూమి పూజ తర్వాత ముఖ్యమంత్రి నేరుగా తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకోనున్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/