శుక్రవారాల్లో, రంజాన్ మాసాంతం హిజాబ్ కు అనుమతించండి: హైకోర్టులో పిటిషన్

పిల్ దాఖలు చేసిన న్యూరో సైకియాట్రిస్ట్

బెంగళూరు : హిజాబ్ కు సంబంధించి కర్ణాటక రాష్ట్ర హైకోర్టులో తాజాగా మరొక ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ముస్లిం బాలికలను కనీసం శుక్రవారాల్లో, పవిత్ర రంజాన్ మాసాంతం హిజాబ్ ధరించేందుకు అనుమతివ్వాలని పిటిషనర్ అందులో కోరారు. హుబ్బళ్లికి చెందిన సామాజిక కార్యకర్త, న్యూరో సైకియాట్రిస్ట్ వినోద్ జి కులకర్ణి ఈ పిల్ దాఖలు చేశారు.

1972లో వచ్చిన హిట్ చిత్రం ‘షోర్’ సినిమాలోని లతా-ముఖేష్ కుమార్ ఆలపించిన ఏక్ ప్యార్ కా నగ్మాహై పాటలోని ‘కుచ్ ప్యార్ హోనా హై, కుచ్ ఖోకర్ పానా హై’ అన్న కోట్ ను ఉటంకించారు. అంటే ఏదైనా కోల్పోతున్నప్పుడు ఏదైనా కొంత పొందడమనే అర్థం ఇందులో స్ఫురిస్తుంది. ఈ అంశాన్ని పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి పేర్కొన్నారు.

హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా హిస్టీరియాలా మారిపోయినట్టు పిటిషనర్ కులకర్ణి చెప్పారు. ఇది ముస్లిం బాలికల మానసిక ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపిస్తుందన్నారు. సిక్కులు కిర్పాన్స్ ను వెంట తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్టే.. హిజాబ్ ను కూడా అనుమతించాలని, దాంతో ప్రస్తుత అశాంతి ముగిసిపోతుందన్నారు. శరీరం, శిరోజాలు కనిపించకూడదంటూ ఖురాన్ చెప్పినదాన్ని ఇక్కడ విస్మరించరాదని కోరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/