ముఖ్య నేతలతో సీఎం జగన్ అత్యవసర సమావేశం

ఏపీ సీఎం జగన్..తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. ఈ భేటీ కి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది.

వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్టు కావడం, ఈరోజు సీబీఐ ముందు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరుకానుండటంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఈ ఉదయాన్నే అవినాశ్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ కు అవినాశ్ రెడ్డి బయల్దేరినప్పుడు.. ఆయనతోపాటు చెవిరెడ్డి ఉన్నారు. ఆ సమయంలో అవినాశ్ తో చర్చించిన అంశాలను జగన్ కు చెవిరెడ్డి వివరించినట్లు సమాచారం. ఇక తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును అవినాశ్ రెడ్డి ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను కోర్టు ఈ రోజు విచారించనుంది.