గ్యాంగ్‌స్ట‌ర్ అతిక్ శ‌రీరంలోకి టర్కీకి చెందిన 9 బుల్లెట్లు

9 bullets shot at gangster Atiq Ahmed, 5 at Ashraf: Reveals autopsy report

న్యూఢిల్లీః దుండగుల కాల్పుల్లో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ చనిపోయిన విషయం తెలిసిందే. గత శనివారం రాత్రి మీడియా ఎదురుగా, పోలీసుల సమక్షంలో, లైవ్ లో జరిగిన ఈ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాము ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్ ను చంపినట్లు నిందితులు చెప్పారు.

అతీక్ అహ్మద్ శరీరంలో 9కి పైగా బుల్లెట్లు ఉన్నట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరపడంతో తలలోకి ఒక బుల్లెట్ దూసుకెళ్లింది. మిగతావి ఛాతి భాగంలో, వీపుపై తగిలినట్లు రిపోర్టులో డాక్టర్లు పేర్కొన్నారు. అతడి సోదరుడు ఆష్రఫ్ శరీరంలో 5 బుల్లెట్లను గుర్తించినట్లు సమాచారం. అందులో ముఖంపై ఓ బుల్లెట్ గాయమైనట్లు పేర్కొన్నారు. ఐదుగురు డాక్టర్ల బృందం పోస్టుమార్టం చేశారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోస్టుమార్టమ్ ను వీడియో తీశారు.

మరోవైపు టర్కీ (తుర్కియే)లోని ‘టిపాస్’ కంపెనీకి చెందిన ‘జిగాన’ తుపాకులను నిందితులు ఉపయోగించినట్లు సమాచారం. ఒక్కో దాని ఖరీదు రూ.6 లక్షలకు పైనే ఉంటుందని సమాచారం. అక్కడి సైన్యం, దళాలు, సెక్యూరిటీ ఏజెన్సీలు వీటిని వాడుతున్నాయి. ఈ తుపాకులపై మన దేశంలో నిషేధం ఉంది. పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి.