జీ20 సదస్సు వ్యయంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

Claims of G20 overspending ‘misleading’; government dismisses allegations

న్యూఢిల్లీః భారత్‌ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు ఘనంగా ముగిసింది. ఈ సదస్సును భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా.. విజయవంతంగా నిర్వహించిందని ప్రపంచ దేశాధినేతలు ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే ఈ సదస్సుకు సంబంధించి ఇప్పుడు ఓ విషయం చర్చనీయాంశమైంది. అదేంటంటే..? జీ20 సదస్సుకు అనుకున్నదానికంటే ప్రభుత్వం 300 శాతం అదనపు వ్యయం చేసిందని తృణమూల్‌ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్ చెక్‌ విభాగం స్పందించి క్లారిటీ ఇచ్చింది. జీ20 సదస్సు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.990 కోట్లు కేటాయించిందని, కానీ రూ.4100 కోట్లు ఖర్చు పెట్టిందంటూ టీఎంసీ ఇటీవల విమర్శలు చేసింది. ఇంత మొత్తం డబ్బు ఎక్కిడికి పోయిందని కేంద్రాన్ని నిలదీసింది.

ఈ నేపథ్యంలో ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తూ.. జీ20 సదస్సు కోసం బడ్జెట్‌లో కేటాయించిన దానికంటే ప్రభుత్వం 300 శాతం అదనంగా ఖర్చు చేసిందంటూ వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆ వ్యయంలో అధిక భాగాన్ని ఐటీబీపీ(జీ20 సదస్సు వేదిక) వంటి సుదీర్ఘకాలం సేవలు అందించే ఆస్తుల కోసం కేటాయించారని తెలిపింది. ఆ నిర్మాణాలు కేవలం ఒక్క జీ20 సదస్సుకే పరిమితం కావని ఫ్యాక్ట్‌ చెక్‌ వెల్లడించింది.