చిరంజీవే మా సీఎం అభ్యర్థి – చింతా మోహన్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవే తమ సీఎం అభ్యర్థి అని.. తిరుపతి నుంచి పోటీకి చిరంజీవిని ఆహ్వానిస్తామని ఆయన అన్నారు. అక్కడినుంచి పోటీ చేస్తే చిరంజీవి సీఎం కావడం పక్కా అన్నారు.
ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్..మెగాస్టార్ పేరును తెరపైకి తెచ్చారు. త్వరలోనే చిరంజీవిని కలిసి తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కోరుతానని,చిరుయే మా సీఎం అభ్యర్థి అని తేల్చిచెప్పారు.
గతంలోనూ చిరంజీవికి సపోర్టుగా వ్యాఖ్యలు చేశారు చింతా మోహన్. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా చిరంజీవి సీఎం అయితే బాగుండేదని వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తిరుపతి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు చిరు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పగా తాజాగా చింతా మోహన్ చేసిన కామెంట్స్ పై ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.