‘జై శ్రీరామ్’ నినాదాలు చేసిన చైనా సైనికులు

జై శ్రీరామ్ అని ఎలా ఉచ్ఛరించాలో చైనా సైనికులకు చెబుతున్న భారత సైనికులు

Chinese PLA Soldiers Chant ‘Jai Shri Ram’ Along with Indian Army Troops at LAC

న్యూఢిల్లీః 500 సంవత్సరాల అయోధ్య రామమందిర కల జనవరి 22, 2024న నెరవేరింది. భారత్‌లోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా హిందువులు బాలరాముడి ఆలయం కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. నిన్న బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని చూసిన హిందువులు మంత్రముగ్ధులయ్యారు. భారత్‌లో ప్రతి గ్రామంలో రాముడి పండుగ కనిపించింది. సోషల్ మీడియాలో జైశ్రీరామ్ నినాదం వినిపించింది. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనికులతో పాటు చైనా సైనికులు కూడా జైశ్రీరామ్ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఓ టేబుల్‌పై డ్రింక్స్, స్నాక్స్ ఉండగా ఇరువైపులా రెండు దేశాల సైనికులు నిలబడి ఉన్నారు. భారత దళాలు… చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దళాలకు జైశ్రీరామ్ నినాదాన్ని ఎలా పలకాలో చెబుతున్నట్లుగా వీడియోలో ఉంది. భారత ఆర్మీ పలికినట్లుగా చైనా సైనికులు జైశ్రీరామ్ నినాదం ఇచ్చారు. అయితే ఈ వీడియో ఏ తేదీని అని స్పష్టంగా తెలియరాలేదు. కానీ మూడు నెలల కిందటిగా భావిస్తున్నారు.

భారత్-చైనా సరిహద్దుల్లో కొన్నేళ్లుగా ఉద్రిక్తతలు ఉన్న విషయం తెలిసిందే. సమస్య పరిష్కారం కోసం ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలో ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట రోజున ఈ వీడియోను ఓ మాజీ సైనికుడు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.