తైవాన్ ను చైనాలో కలిపేసుకోవడమే తమ ఎజెండా

అది తైవాన్ ప్రజలకే మంచిదని వార్నింగ్
శాంతి అంటూనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు

బీజింగ్: చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ తైవాన్ పై నేరుగా రెచ్చొగట్టే వ్యాఖ్యలు చేశారు. తైవాన్ ను శాంతియుతంగా చైనాలో కలిపేసుకోవడమే తమ ఎజెండా అని అన్నారు. వేర్పాటు వాదాన్ని వ్యతిరేకించే గొప్ప సంస్కృతి ఉన్న వారు చైనీయులని అన్నారు. ‘‘తైవాన్ మా మాతృభూమిలోనే భాగమే. ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ వేర్పాటు వేదాన్ని కోరుకుంటున్న తైవాన్ ను మాలో కలుపుకోవడమే అతిపెద్ద సవాల్ గా మారింది. అది దేశ పునరుత్తేజానికి అతి ప్రమాదకారి’’ అని చెప్పారు. శాంతియుతంగా తమలో కలిస్తేనే తైవాన్ ప్రజలకు మంచిదని సూచించారు.

దేశ సార్వభౌమత్వం, సమగ్రత విషయంలో చైనా ప్రజల సంకల్పం, దృఢ చిత్తం, చేయగలమన్న ధీమాను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తైవాన్ ను తమలో కలిపేసుకుంటామని తేల్చి చెప్పారు. కాగా, ఐలాండ్ దేశంపై వైమానిక దాడులు చేసైనా తమ అధీనంలోకి తెచ్చుకుంటామని 2019లో జిన్ పింగ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

దీంతో పోరాడేందుకు తామూ సిద్ధమేనని, చైనాలో కలువబోమని తైవాన్ కూడా అంతే దీటుగా బదులిచ్చింది. తాజాగా వారం రోజులుగా చైనా యుద్ధ విమానాలు తైవాన్ పై చక్కర్లు కొడుతుండడం.. మరికొన్ని రోజుల్లో చైనా సైనిక చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయన్న చర్చకు దారి తీసింది. ఇప్పుడు చైనా అధ్యక్షుడే నేరుగా దాని మీద కామెంట్ చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/