మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బెంగళూరు-పుణె జాతీయ రహదారిపై పుణె సమీపంలోని నర్హె ఏరియాలో ఎదురురెదురుగా వస్తున్న లారీ, ప్రైవేటు బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని , క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టు మార్టానికి పంపించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్స్ తెలిపారు.