ప్రజలకు మేలు చేసే జగన్ ను మళ్లీ సీఎం చేసుకోవాలిః మిథున్ రెడ్డి

చంద్రబాబు మళ్లీ వస్తే జన్మభూమి కమిటీలు మాత్రమే ఉంటాయన్న మిథున్ రెడ్డి

chandrababu-will-remove-volunteers-says-mithun-reddy

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రుణమాఫీ అంటూ డ్వాక్రా మహిళలు, రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సచివాలయాలు ఉండవని, జన్మభూమి కమిటీలు మాత్రమే ఉంటాయని చెప్పారు. చంద్రబాబు వస్తే వాలంటీర్లను తొలగిస్తారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా బాగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వాల మధ్య తేడాలను ప్రజలు గమనించాలని చెప్పారు.

టిడిపి హయాంలో ఒక సర్టిఫికెట్ కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేదని… పెన్షన్ల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేదని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రజల కోసం అన్నీ ఇంటి వద్దకే వచ్చేలా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని అన్నారు. మనకు మేలు చేసిన వారి రుణం తీర్చుకోవాలని… జగన్ ను మళ్లీ సీఎం చేసుకోవాలని ప్రజలను కోరారు.