20న బిజెపి అగ్ర నేతలతో చంద్రబాబు చర్చలు..!

tdp-chandrababu

అమెరికాః రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం. తాజాగా పాత మిత్రులు టిడిపి, బిజెపిలు మళ్లీ చేతులు కలుపుతున్నాయి. వచ్చే వారం ఎన్డీయేలో టిడిపి చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న లేదా 20న టిడిపి అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం.

మరోవైపు ఈరోజు, రేపు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల తర్వాత పొత్తులపై పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. 20న చంద్రబాబు, పవన్ లతో బిజెపి అగ్ర నేతలు చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే మూడు పార్టీల మధ్య అవగాహన కుదిరిందని… సీట్ల పంపకాల విషయంలో కూడా ఒక అవగాహనకు వచ్చారని తెలుస్తోంది. ఇంకోవైపు, ఎన్డీయేలో చేరే ఇతర పార్టీల అధినేతలందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో బిజెపి ఉంది.