నేడు నింగిలోకి జీఎస్‌ఎల్వీ రాకెట్‌.. కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌

Isro begins countdown to GSLV-F14 launch with INSAT-3DS mission

న్యూఢిల్లీః భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి శనివారం(ఈరోజు) సాయంత్రం 5.35 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 రాకెట్‌ నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. ఈ కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శనివారం సాయంత్రం ప్రయోగ సమయం వరకు నిరంతరాయంగా 27.30 గంటలపాటు కొనసాగుతుంది.

కౌంట్‌డౌన్‌ ముగియగానే షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 రాకెట్‌ దూసుకెళ్లనుంది. ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ గురువారం అర్ధరాత్రి షార్‌కు చేరుకుని, కౌంట్‌డౌన్‌ ప్రక్రియను పర్యవేక్షించారు. శాస్త్రవేత్తలకు సూచనలు చేశారు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ 2,275 కిలోల బరువు గల ఇన్సాట్‌-3డీఎస్‌ (INSAT-3DS) ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది.

ఈ ఉపగ్రహాన్ని వాతావరణ పరిశీలనలను మెరుగుపరచడానికి, భూమి, సముద్ర ఉపరితలాలను పర్యవేక్షించడానికి రూపొందించారు. తద్వారా వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం కక్ష్యలో ఉన్న ఇన్సాట్‌-3డీ, ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాలతో కలిసి ఈ ఉపగ్రహం పనిచేయనుంది.