ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరాన్ని సందర్శించిన చంద్రబాబు

టీడీపీ అధినేత ప్రస్తుతం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా నేడు అనంతపురంలోని ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరాన్ని దర్శించారు. చంద్రబాబుకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. కృష్ణాష్టమి నేపథ్యంలో ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి స్వయంగా వింజామర వీచారు. ఆలయ అర్చకులు చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

స్వామివారి చిత్రపటాలను బహూకరించారు. అంతకుముందు ఆయన కల్యాణదుర్గంలో వ్యవసాయ సంక్షోభంపై నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చాక రాయలసీమను ఉద్యాన హబ్ గా మార్చుతామని తెలిపారు. గతంలో తాము రైతులకు పెట్టుబడి రాయితీ ఇచ్చి ఆదుకున్నామని, పంట బీమా తీసుకువచ్చామని, ఈ రెండు ఇచ్చిన ఘనత తమదేనని చంద్రబాబు అన్నారు.