ఏం చేశాడని విశ్వసీనత గురించి మాట్లాడుతున్నాడుః చంద్రబాబు

క్లబ్బు డ్యాన్సర్లు కూడా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారని వ్యంగ్యం

chandrababu-comments-jagan-in-venkatagiri-raa-kadali-raa-meeting

వెంకటగిరి: తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ‘రా కదలిరా’ సభలో టిడిపి అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శిశుపాలుడు 100 తప్పులు చేస్తే జగన్ 1000 తప్పులు చేశాడని మండిపడ్డారు. జగన్ విశ్వసనీయత పెద్ద ఫార్స్ అని విమర్శించారు. హోదా తెచ్చాడా, సీపీఎస్ రద్దు చేశాడా, మద్యపానిషేదం చేశాడా… ఏం చేశాడని విశ్వసనీయత గురించి చెప్పుకుంటున్నాడు? అని నిలదీశారు. ఎర్రచందనం స్మగ్లర్ లకు అసెంబ్లీ టిక్కెట్లా? ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు పేర్కొన్నారు. దొంగ ఓట్ల అక్రమాలకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

చెన్నైతో తిరుపతి, నెల్లూరుని లింక్ చేసి హబ్ గా చేయాలనుకున్నాం. వీటిని కనెక్ట్ చేస్తూ రోడ్లని వేశాం. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్ గా చేశాం. సెల్ కాన్, కార్బన్, డెక్కన్ వంటి అనేక కంపెనీలు తిరుపతికి తెచ్చాం. అక్కడ కంపెనీల్లో పని చేయించుకునేందుకు వెంకటగిరి నుంచి యువతను బస్సులో తీసుకువెళ్లుతున్నారు. హీరో మోటార్స్, అపోలో టైర్లు, రిపబ్లిక్ ఫోర్స్ తో శ్రీ సిటీలో పెట్టి యువతకు ఉద్యోగాలు ఇచ్చాం. దేశంలోనే మంచి సంస్థలను తీసుకువచ్చాం. కాని నేడు అన్నీ పోయాయి.

తిరుమల భక్తుల కోసం రూ.630 కోట్లతో గరుడ వారధి తీసుకువస్తే జగన్ గంజాయి తెచ్చారు. మనం ఒక టెంపుల్ సిటీగా ప్రమోట్ చేస్తే జగన్ దొంగ ఓట్ల సంస్కృతి తెచ్చారు. నాడు రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే జగన్ 24 శాతం నిరుద్యోగం పెంచారు. జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మనం దక్షిణ కొరియా ప్రభుత్వంతో మాట్లాడి కియా లాంటి కారు పరిశ్రమను తీసుకువస్తే జగన్ మాత్రం అమర్ రాజాను తరిమేశారు. టీడీఆర్ బాండ్స్ లో రూ.25 వేల కోట్ల అక్రమాలు జరిగాయి. టిడిపి అధికారంలోకి వస్తే ఎంక్వైరీ వేసి తప్పు చేసిన వాళ్లందరిని శిక్షిస్తాం.

ఎర్రచందనం వైఎస్‌ఆర్‌సిపి నాయకులకు ఆర్ధిక వనరుగా మారింది. ఎర్రచందనం స్మగ్లర్లకు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. రూ.7,500 కోట్లు దోపిడీ చేశారు. నాడు మేం ఎర్రచందనాన్ని ఉక్కుపాదంతో అణచివేశాం. నేడు సాక్షాత్తు స్మగ్లర్ కే చిత్తూరు ఎమ్మెల్యే సీటు ఇచ్చారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. ఆయనకు అపచారం చేస్తే ఆ దేవుడు మిమ్మల్ని వదలిపెట్టరు. కొండపై అన్నదానం బాగుందా? ఎన్టీఆర్ అన్నదానాన్ని ప్రారంభించారు.

ఏ పాలకుడైనా అభివృద్ధి చూసి ఓట్లు అడుగుతారు. కాని ఈ దుర్మార్గుడు మాత్రం ఓట్ల విధ్వంసం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో లక్షా 15వేల దొంగ ఓట్లు చేర్చారు. దానికి జగన్ వత్తాసు పలుకుతున్నారు. దొంగ ఓట్లకు పాల్పడుతున్న అధికారులకు శిక్షలు పడుతున్నాయి. కోర్టులో కేసును వెనక్కి తీసుకోమని ఇప్పుడు పనబాక లక్ష్మి ఇంటికి అధికారులు క్యూలు కడుతున్నారు. కేసు వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. మిమ్మల్ని బోన్ ఎక్కించే బాధ్యత టిడిపి తీసుకుంటుంది. దొంగ ఓట్లతో మనుషులు బ్రతికి ఉండగానే చంపేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గులకు శిక్షలు తప్పవు.

జగనన్న బాణం రివర్స్ అయింది. కారణమేంటి? ఇదేనా విశ్వసనీయత? జగన్ రెడ్డి విశ్వసనీయత ఎలాంటిదంటే… 29 మంది దళిత ఎమ్మెల్యేలను మార్చాడు. మోసం చేసి ఓట్లు వేయించుకుని మరోసారి రాజకీయ కుట్రకు తెరలేపాడు. మోసం చేసి ఓట్లు వేయించుకోవాలని అనుకుంటున్నాడు. కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టినా.. దాని వెనుకటి గుణములు మరచిపోదు. ఫ్యాక్షనిస్టు, నేరస్తుడు, మానసిక రోగి అని తెలిసినా.. నెత్తిన చెయ్యి పెట్టి ఒక్క ఛాన్స్ అనగానే ఐస్ అయిపోయి ఓట్లేశాం. చివరికి అందరం నష్టపోయాం.

వెంకటగిరికి వచ్చిన కొత్త బిచ్చగాడు… పెన్నా నదిలో ఇసుక వదలడు. తెల్ల రాయి వదలడు. మొలకలకొండలో కొండలు తవ్వేశాడు. భూములు కబ్జాలు చేస్తున్నాడు. ఇసుక, మద్యం, గంజాయి, క్రిటెట్ బెట్టింగుల్లో కలివేటి సిద్ధహస్తుడు. జగన్ రెడ్డి స్పూర్తితో స్థానిక ఎమ్మెల్యే అంతకు మించి అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. గూడూరులో ఎమ్మెల్యే వర ప్రసాద్ ఇసుక, సిలికా దోపిడీ తేల్చాలంటే పుస్తకాలు సరిపోవు. క్లబ్బు డాన్సర్లు కూడా మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు.

కోర్టుల్లోని సాక్ష్యాలు కూడా కొట్టేసే కాకాణి ఒక మంత్రి. మద్యం, గ్రావెల్ దోపిడీతో జిల్లాను సైతం కొనేసే స్థాయిలో వెనకేసుకున్నాడు. మైనింగ్ పుడింగి దోపిడీకి రాష్ట్రంలోని మైన్స్ అన్నీ బెంబేలెత్తుతున్నాయి. రేణిగుంటను కూతురికి, ఏర్పేడు తమ్ముడికి పంచేశారు. కాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ఆక్రమించుకున్నారు. ఏడు కొండల వాడిని సైతం దోచుకునే వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. ఇంతటి దుర్మార్గులొస్తారని ఎప్పుడూ ఆలోచించలేదు. ప్రశాంతమైన చిత్తూరులో ఇలాంటి దుర్మార్గులు అధికారంలోకి రాకూడదు.