ఒకే విమానంలో ప్రయాణించిన మంత్రి రోజా..చంద్రబాబు

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు..వైసీపీ మంత్రి రోజా ఇద్దరు ఒకే విమానంలో కలిసి ప్రయాణించారు. పరస్పరం ఆరోపణలు, విమర్శలు గుప్పించుకునే నేతలు ఈ విధంగా ఒకే విమానంలో ప్రయాణించడం ఆసక్తిని రేకెత్తించింది. శుక్రవారం తిరుపతి నుంచి విజయవాడకు ఇద్దరు కలిసి ఇండిగో విమానంలో ప్రయాణం చేసారు.

ఇక చంద్రబాబు రాక కోసం టీడీపీ శ్రేణులు అప్పటికే పెద్ద సంఖ్యలో విమానంలో వేచివుండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ప్రత్యేక లాంజ్ ద్వారా మంత్రి రోజాను పోలీసు అధికారులు బయటకు పంపించారు. గతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో జనసేన కార్యకర్తలు వేచివున్న సమయంలో రోజా రాకతో తలెత్తిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ విధంగా వ్యవహరించారు. ఇదే కాదు చంద్రబాబు, రోజా ప్రయాణించిన విమానం విజయవాడకు చేరుకోవడానికి 10 నిమిషాల ముందే జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదే విమానాశ్రయంలో అడుగుపెట్టారు. హైదరాబాద్ నుంచి విజయవాడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన మంగళగిరి వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలా ముగ్గురు నిమిషాల వ్యవధిలో ఎయిర్ పోర్ట్ లో అడుగుపెట్టారు.