వివేకా హత్య కేసు..ఎర్ర గంగిరెడ్డికి జూన్ 2 వరకు రిమాండ్

గంగిరెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించనున్న సీబీఐ అధికారులు

cbi-court-remands-erra-gangireddy-till-june-2

హైదరాబాద్‌ః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. బెయిల్ పై బయటున్న ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాదులోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. అనంతరం, సీబీఐ కోర్టు ఎర్ర గంగరెడ్డికి జూన్ 2 వరకు రిమాండ్ విధించింది. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో, సీబీఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. తాను లొంగిపోయే విషయమై గంగిరెడ్డి ఇటీవలే స్పష్టత ఇచ్చారు. తన న్యాయవాదితో చర్చించానని, ఆయన సలహా మేరకు లొంగిపోతానని వెల్లడించారు. 2019లో వివేకా హత్య జరగ్గా, అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎర్ర గంగిరెడ్డిని అరెస్ట్ చేసింది.

తగిన సమయంలో చార్జిషీటు దాఖలు చేయడంలో సిట్ విఫలం కాగా, ఎర్ర గంగిరెడ్డికి పులివెందుల కోర్టులో డిఫాల్ట్ బెయిల్ లభించింది. అయితే ఈ కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టడం, విచారణ కూడా తెలంగాణకు బదిలీ కావడంతో పరిణామాలు చకచకా మారాయి. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఆదేశాలు ఇవ్వాలని సీబీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. దాంతో, తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే, ఎర్ర గంగిరెడ్డి ఈరోజు సీబీఐ న్యాయస్థానంలో లొంగిపోయారు.