మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం

మేడ్చల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన సంతోష్ (12) అనే బాలుడు ..శుక్రవారం కొండాపూర్‌లోని వాసవి వెంచర్‌లోని మ్యాన్‌హోల్‌లో అతడి మృతదేహం లభ్యమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మూడ్రోజుల క్రితం వర్షం పడుతున్న సమయంలో సంతోష్ బయటకు వెళ్లాడు. ఆ తర్వాత తిరగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ బాలుడు ఎక్కడా కనిపించకపోవడంతో భయాందోళనకు గురై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో బాలుడి అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

నేడు వాసవి వెంచర్‌లో అనుమానాస్పదంగా మృతదేహం లభ్యమైంది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాన్ని చూపించారు. ఇది మూడ్రోజుల క్రితం అదృశ్యమైన సంతోష్ అనే బాలుడి మృతదేహాంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. బాలుడి ఎలా చనిపోయాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఎవరైనా హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడేశారా? లేదా బాలుడు వర్షంలో జారి మ్యాన్‌హోల్‌లో పడి ఉంటాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.