బిఆర్ఎస్ ఫై కీలక వ్యాఖ్యలు చేసిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

బిఆర్ఎస్ పార్టీ ఫై వైస్సార్సీపీ యువనేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లో పార్టీ జెండాను ఎగురవేసిన కేసీఆర్..నేడు ఖమ్మం లో తొలి బహిరంగ సభ ఏర్పాటు చేసారు. దీంతో దేశ వ్యాప్తంగా బిఆర్ఎస్ గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఈ తరుణంలో వైస్సార్సీపీ యువనేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బిఆర్ఎస్ ఫై పలు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. బిఆర్ఎస్ ఏపీలో అడుగుపెడితే ఏంచేస్తుందో చూస్తామని…తెలంగాణలో జగన్ ప్రవేశిస్తే అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు వస్తాయని వ్యాఖ్యానించారు. ‘జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన కోసం స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయి… ఆ దృష్టితోనే నేను జగన్ కు ప్రైవేటు సైన్యం ఉందని వ్యాఖ్యానించాను. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ జగన్ అభిమానులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, పొడిచేస్తుంది, చించేస్తుంది అంటూ తెలంగాణ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చి ఏం చించుతారో, ఏం పొడుస్తారో తెలీదు కానీ… జగన్ సార్ తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే మాత్రం అక్కడి ప్రభుత్వాలే తలకిందులవుతాయి’ అని బైరెడ్డి కామెంట్స్ చేసారు.

అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కూడా పలు కామెంట్స్ చేసారు. పవన్ కల్యాణ్ కు కనీసం 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా? అని ప్రశ్నించారు. హైపర్ ఆది లాంటి వాళ్లు తాము ఎలాంటి నాయకుల కింద పనిచేస్తున్నామో గుర్తించాలని అన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ ను బూతులు తిట్టి, ఇప్పుడు పవన్ కల్యాణ్ పార్టీలోకి వెళ్లి మమ్మల్ని బూతులు తిట్టేవాళ్లను కూడా చూశాం అని పేర్కొన్నారు. అయితే హైపర్ ఆదిని గానీ, ఆ పార్టీకి చెందిన ఇతర వ్యక్తులను గానీ తప్పుబట్టనని, ఆ పార్టీ నాయకత్వాన్నే తప్పుబడతానని బైరెడ్డి స్పష్టం చేశారు.