తెలంగాణలో 48 గంటల పాటు రాజకీయ పార్టీల SMS లు నిషేధం

తెలంగాణ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ కు చేరుకుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రచారం పూర్తి అవుతుంది. ఆ తర్వాత అంత సైలెంట్ వాతావరణమే. ఎలాంటి ర్యాలీ లు, ప్రచార వాహనాలు కనిపించవు. అంతే కాదు రెండు రోజుల పాటు రాజకీయ పార్టీల నుండి SMS లు కూడా రావు. అభ్యంతరకర, రాజకీయపరమైన, బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ల ప్రసారంపై ఎన్నికల అధికారులు నిషేధం విధించారు. వీటి ప్రసారాలపై నిశితంగా పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలకు 48 గంటల ముందు నుంచే రాజకీయపరమైన ఎస్‌ఎంఎస్‌ల ప్రసారాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిలిపివేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు, సూచనలను ఉల్లంఘించేలా ఎస్‌ఎంఎస్‌లు పంపరాదని సూచించారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే విచారణ జరిపి భారత శిక్షాస్మృతి ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.