రేపు ఖమ్మం లో జరగబోయే బిఆర్ఎస్ సభలో నోరూరించే వంటకాలు ఇవే…
ఖమ్మంలో రేపు బీఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ జరగబోతుంది కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ని ప్రకటించిన తర్వాత తొలిసారి భారీ బహిరంగ సభ పెడుతుండడం తో అదికూడా ఖమ్మంలో నిర్వహిస్తుండడం తో దేశ వ్యాప్తంగా ఈ సభ ఫై ఉత్కంఠ నెలకొంది. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్య కర్తలు హాజరు కాబోతున్నారు. దీనికి సంబదించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అలాగే ఈ సభకు బిఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం హాజరుకాబోతున్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.
ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ.. సభకు విచ్చేసే ప్రముఖ నేతలకు తెలంగాణ స్టైల్లో ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే.. అతిథులకు పసందైన విందు ఇవ్వనున్నారు. ఈ సభకు వచ్చే అతిథులకు ఘుమఘుమలాడే తెలంగాణ వంటకాల రుచి చూపించేందుకు.. మెనూ సిద్ధం చేశారు. మొత్తం 38 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. వాటిలో 17 రకాల నాన్ వెజ్ ఐటెమ్స్, 21 రకాల వెజ్ వంటకాలు వండించనున్నారు. మటన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, కొరమీను కూర, తెలంగాణ స్టైల్ మటన్ కూర, తలకాయ ఇగురు, నాటుకోడి కూర, బొమ్మిడాయల పులుసు, బోటీ ఫ్రై, మటన్ లివర్ ఫ్రై ఇలా ఘుమఘుమలాడే మాంసాహార వంటాకాలు వండిస్తున్నారు. అలాగే పనీర్ బటర్ మసాలా, మెతీ చమన్, దాల్ తడ్కా, బచ్చలకూర, మామిడికాయ పప్పు, బీరకాయ శనగపప్పు, బెండకాయ కాజు ఫ్రై, ముద్దపప్పుతో పాటు తెలంగాణ ఫేమస్ అయిన పచ్చిపులుసు కూడా మెనూలో ఉంది. ఈ రకరకాల వంటకాలను మొత్తం 500 మంది అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు.