కేంద్ర ఎన్నికల సంఘంతో బీఆర్‌ఎస్‌ నేతలు భేటీ

కేంద్ర ఎన్నికల సంఘంతో బీఆర్‌ఎస్‌ నేతలు వినోద్‌ కుమార్‌, శ్రీనివాస్‌ రెడ్డి భేటీ అయ్యారు. టీఆర్‌ఎస్‌ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు అందించారు. పేరు మార్పును గుర్తించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. దసరా పర్వదినాన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర మంత్రులు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్‌పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారు.

సభ్యులందరూ తీర్మానాలపై సంతకాలు చేశాక.. మధ్యాహ్నం 1: 19 నిమిషాలకు కేసీఆర్ సంతకం చేశారు. ఈ భేటీకి తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ నేతృత్వంలో బృందం నేడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయింది. డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ధర్మేంద్ర శర్మకు తీర్మానం కాపీ అందించామని వినోద్‌ కుమార్‌ చెప్పారు. చట్టప్రకారం పరిశీలించి అనుమతి ఇస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు.