యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపేందుకు కుట్ర – మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి

యాదాద్రి థ‌ర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు మంత్రి జగదీశ్ రెడ్డి. యాదాద్రి థ‌ర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలంటూ NGT ఇచ్చిన తీర్పుపై మ్నాత్రి జగదీశ్ స్పందించారు. అన్ని పర్యావరణ అనుమతులు తీసుకున్నాకే తాము ప‌వ‌ర్‌ప్లాంట్ నిర్మాణం మొదలుపెట్టామ‌ని అన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఏకపక్షంగా ఉన్న‌ద‌ని, దీనివ‌ల్ల యావత్ దేశానికి కూడా నష్టమ‌ని మంత్రి చెప్పారు. వేల కోట్ల రూపాయల ఖ‌ర్చుతో నిర్మాణం చేపట్టిన త‌ర్వాత ప‌వ‌ర్‌ప్లాంట్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం స‌రికాద‌న్నారు. ప‌వ‌ర్‌ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలంటూ లేవనెత్తిన అంశాలు కూడా పూర్తి అసంబద్ధంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

ఎక్కడో ఉన్న ముంబై సంస్థకు యాదాద్రి పవర్ ప్లాంట్ కి సంబంధం ఏంట‌న్నారు. దీని వెనకాల కచ్చితంగా కుట్ర దాగి ఉంద‌ని, పర్యావరణ అనుమతులు వచ్చాకే నిర్మాణం చేపట్టామ‌న్నారు. గతంలో ఇదే సంస్థ కేసు వేసినప్పుడు ఎన్ జీటీ ట్రిబ్యునల్ కొట్టి వేసింద‌న్నారు. కేసు వేసిన ముంబై సంస్థ వెనకాల అదృశ్య శక్తులు ఉన్నాయ‌న్నారు. అన్ని చట్టాలకు లోబడే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంద‌న్నారు. NGT తీర్పు పై రివ్యూ పిటిషన్ వేస్తామ‌ని, అనుకున్న సమయానికల్లా యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామ‌న్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం ఆపాలని వచ్చిన తీర్పు పై న్యాయపోరాటం చేస్తామ‌ని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి అన్నారు.